ఖైరతాబాద్ మహా గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు... క్రేన్ నెం.4 వద్ద నిమజ్జనం పూర్తి

హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 

ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు. 

ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఎప్పుడూ చివరగా తరలివెళ్లే ఖైరతాబాద్ మహా వినాయకుడ్ని ఈసారి ముందుగానే నిమజ్జనం చేశారు. ప్రస్తుతం గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది.

Khairatabad Maha Ganapathi
Immersion
Shobha Yatra
Hyderabad
Telangana

More Telugu News